పలు రాష్ట్రాలు పోటీ పడిన బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కోసం చివరికి ఏపీ ఎంపికైంది. ఏపీలోనే ఈ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యాజమాన్యం నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఏపీలో ఏర్పాటు రిఫైనరీ ఏర్పాటు నిమిత్తం ముందస్తు కార్యకలాపాలను ప్రారంభించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్టు సెబీ, స్టాక్ ఎక్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం బీపీసీఎల్ కు ముంబై, మధ్యప్రదేశ్, కొచ్చిలో ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. తాజాగా నాలుగో రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేయనుంది.
ఏపీలోని తూర్పు తీరంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని రూ. 6100 కోట్లతో చేపడతారు. ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలతో పాటు ఇతర అధ్యయనాలు, భూమి గుర్తించడం, భూ సేకరణ, సవివరమైన సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ, పర్యావరణ ప్రభావ అంచనా, ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ మొదలైనవి చేపడతారని బీపీసీఎల్ వివరించింది.
బిజెపి అధికారంలో ఉన్న మరో రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ బిపిసిఎల్ రిఫైనరీ దక్కించుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఈ ప్రాజెక్ట్లో సుమారు రూ. 50,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని ప్రచారం జరిగినా ప్రాథమికంగా రూ.6100కోట్ల పెట్టుబడులకు అమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని వేర్వేరు ప్రాంతాల్లో రిఫైనరీ ఏర్పాటు కోసం పోటీ పడ్డాయి. బీపీసీఎల్ సిఎండి జి కృష్ణ కుమార్ నేతృత్వంలోని బిపిసిఎల్ ఉన్నతాధికారులు గత జూలైలో అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమై ప్రతిపాదనపై ప్రాథమిక చర్చలు జరిపారు.
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక మిత్రపక్షంగా ఉంది. మరో ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, HPCL ఇప్పటికే విశాఖపట్నంలో చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తోంది.
గత జూన్లో జరిగిన చర్చల్లో రిఫైనరీ ఏర్పాటుకు కనీసం 4,000 నుండి 5,000 ఎకరాల భూమి అవసరమని BPCL బృందం సీఎంకు సూచించింది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రిఫైనరీని మచిలీపట్నంలో లేదా కాకినాడ పరిసరాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో పోర్టులు కూడా అందుబాటులో ఉండడంతో రిఫైనరీకి అనుకూలంగా భావిస్తున్నారు.
90 రోజుల్లోగా కంపెనీకి అవసరమైన భూమిని కేటాయిస్తామని బిపిసిఎల్ బృందానికి చెప్పానని, ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన వివరణాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలని కంపెనీ ప్రతినిధులను కోరినట్లు సీఎం గతంలో చెప్పారు. సాధ్యాసాధ్యాల నివేదికతో అక్టోబర్ నాటికి తిరిగి వస్తామని కంపెనీ ప్రతినిధులు అప్పట్లో బీపీసీఎల్ ప్రకటించింది. తాజాగా రూ.6100కోట్ల పెట్టుబడులు పెట్టనుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించినట్లయింది.