అదానీ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ బీఐ ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని జగన్ అన్నారు. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదని ఆయన స్పష్టం చేశారు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేవారిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయబోతున్నా అని జగన్ అన్నారు.
అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదు. రాష్ట్రంలో అదానీకి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎఫ్ బీఐ చార్జ్ షీటులో నా పేరు ఎక్కడా లేదు. వాస్తవాలు తెలియకుండా నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అమెరికాలో పెట్టిన కేసు గురించి నాకు తెలియదు. నా పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు ఇస్తాం. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నాం ”అని జగన్ చెప్పారు.
సోలార్ పవర్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 1న సెకీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కమ్ లు సంతకాలు చేశాయి. 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది. యూనిట్ కు రూ.2.49కి విద్యుత్ ఇస్తామని సెకీ పేర్కొంది. ఐఎస్ టీఎస్ ఛార్జీలు లేకుండా సెకీ ఆఫర్ చేసింది. 9వేల మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఏపీ చరిత్రలోనే అతి తక్కువకు చేసుకున్న ఒప్పందం ఇది. ఉచిత కరెంట్ కు రూ.9వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. రాష్ట్రానికి మంచి చేస్తే బురదజల్లుతున్నారు. చంద్రబాబు పీపీఏల వల్ల రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కు అదనంగా రూ.3.41 కట్టాలి. చంద్రబాబు పీపీఏల వల్ల ఏడాదికి రూ.1500 కోట్ల అదనపు భారం పడింది. మా హయాంలో సంపద సృష్టి లక్ష కోట్లు అయితే.. చంద్రబాబు హయాంలో రూ.87 వేల కోట్ల సంపద ఆవిరైంది” అని జగన్ అన్నారు.