దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఆడ పులి మూడు రాష్ట్రాలను ముప్పతిప్పులు పెట్టింది. దాని శరీరానికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా అది ఎక్కడికెక్కడికి వెళుతుందో తెలుసుకుంటూ అనేక చోట్ల ఉచ్చులు వేసినా ఎక్కడా చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. 21 రోజులపాటు ఒడిస్సా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లోని 300 కిలోమీటర్ల మేర అది ప్రయాణించింది. మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. మూడు రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు దాని పాదముద్రలు, ఇతర గుర్తులు, రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు జాడ తెలుసుకుని వెళ్లినా అది వారి కళ్లు గప్పి తప్పించుకుని వెళ్లిపోయేది. చివరికి 21 రోజుల తర్వాత పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాల్లో దానికి మత్తు మందు ఇచ్చి బంధించడంతో ఆయా రాష్ట్రాలు ఊపిరిపీల్చుకున్నాయి.
మహారాష్ట్ర నుంచి తెచ్చి ఒడిస్సాలో వదిలారు
ఒడిస్సాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంతతిని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోభాగంగా నవంబర్ 14న మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ నుండి జీనత్తోపాటు మరో పులి యమునను ఒడిస్సాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వుకు తీసుకువచ్చారు. కొత్త ప్రాంతం కావడంతో జీనత్ను 10 రోజుల పాటు అలవాటు పడేందుకు సాఫ్ట్ ఎన్క్లోజర్లో ఉంచి నవంబర్ 24న సిమిలిపాల్ కోర్ ఏరియాలో వదిలారు. మొదట్లో అవి సిమిల్పాల్ పరిధిలోనే తిరిగాయి. డిసెంబర్ 8వ తేదీన మూడేళ్ల వయసున్న జీనత్ టైగర్ రిజర్వు పరిధి దాటేసి తప్పించుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. దానికి శరీరానికి రేడియో కాలర్ అమర్చి అది తిరిగే ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. కొన్నిసార్లు రేడియో కాలర్ సిగ్నల్ బలహీనంగా ఉండడంతో దాన్ని ట్రాక్ చేయడం సాధ్యమయ్యేది కాదు. అందుకే పలుచోట్ల నైలాన్ ఉచ్చులు వేసి, మత్తు బాణాలు వదిలినా అది దొరకలేదు.
ట్రాన్స్లొకేషన్ షాక్తోనే..
అలా వెళుతూ అది ఒడిస్సా నుంచి ఝార్ఖండ్లోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడంతో అక్కడి అటవీ గ్రామాల ప్రజలు వణికిపోయారు. పులి పాదముద్రలు గుర్తించేలోపే మరో చోటుకు వెళ్లిపోయేది. ఆ తర్వాత ఝార్ఖండ్ దాటి మరో వంద కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. మొదట ఝార్గ్రామ్లో స్థానికుల్ని హడలెత్తించింది. చివరికి అడపా దడపా వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా 21 రోజుల తర్వాత బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో జీనత్ జాడ కనిపెట్టి మత్తు మందు ఇచ్చి బంధించారు. మూడు వారాల్లో మూడు రాష్ట్రాల్లో కలకలం రేపిన పులిని బంధించారన్న సమాచారంతో ఆయా రాష్ట్రాలు ఊపిరిపీల్చుకున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పులిని బంధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పట్టుకున్న తర్వాత పరీక్షించగా అది ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అయితే తన భూభాగం కాకపోవడంతో అది ట్రాన్స్లొకేషన్ షాక్కు గురైనట్లు భావిస్తున్నారు. పులులు సాధారణంగా తమ భూభాగం దాటి తిరగవు. బయట ప్రాంతం కావడం, ఆ ప్రాంతంలో ఇతర పులులు కూడా ఉండడంతో అది సర్దుకోలేక, దిక్కు తెలియక ఎటు పడితే అటు వెళ్లినట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.