Andhrabeats

జగన్ సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

వైసీపీ అధ్యక్షుడు జగన్ కు వ్యతిరేకంగా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను  జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం  న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవని, అలాంటప్పుడు రద్దు అవసరమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని వ్యాఖ్యానించింది.

అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా? అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒక దశలో పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది.

వాదనలు ఇలా

గత 12 ఏళ్లుగా ట్రయల్‌ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని. ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌ కూడా డిస్పోజ్‌ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని, తాము ఇప్పుడు కేసు మానిటరింగ్‌ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.  మరోవైపు ఈ కేసును హైకోర్టు మానిటర్‌ చేస్తోందని, ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్‌ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్‌ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది.

TOP STORIES