Andhrabeats

జమిలి వచ్చినా ఎన్నికలు 2029లోనే

ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో ముందుకు వెళుతూ జమిలి ఎన్నికల విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చినా రాష్ట్రంలో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అంటే వచ్చే సాధారణ ఎన్నికల నుంచి జమిలి అమలవుతుందని ఆయన అభిప్రాయంగా ఉంది.

నిజానికి జమిలి వస్తే ఎన్నికలు రెండేళ్ల ముందుకు జరుతాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2027 చివర్లో పార్లమెంటుతోపాటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరిగింది. అందులోభాగంగానే ఏపీలోనూ 2029 ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

‘జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే జరుగుతాయి. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం. వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోంది. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది’ అని అన్నారు.

‘స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలి. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయి. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదు. భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలి. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే. ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తాం. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు. సమాధానాల రూపంలో నిర్వహిస్తాం. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతాం. అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు

TOP STORIES