Andhrabeats

ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు

 

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించారు. రైతుల నుంచి ధాన్య సేకరణ ఎలా చేస్తున్నారో సీఎంకు రైతు సేవా కేంద్రం సిబ్బంది వివరించారు. అనంతరం తాము ధాన్యం ఎలా అమ్ముతున్నది సీఎంకు రైతులు వివరించారు. గతేడాది కంటే ఈ ఏడాది పంట ఎక్కువగా వచ్చిందని, మిషన్‌ కోత వల్ల ఎకరానికి అయిదారు వేలు కలిసి వచ్చిందని రైతులు చెప్పారు. కోసిన గడ్డిని బయోఫ్యూయల్‌ ప్లాంట్‌ వాళ్లు తీసుకుంటే మరో రూ.5 వేల వరకూ వస్తుందని రైతులకు సీఎం తెలిపారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయా అని సీఎం అడగ్గా…డబ్బులు కరెక్టుగానే వస్తున్నాయని రైతులు సమాధానమిచ్చారు.

రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరిశీలించిన అనంతరం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఒకరోజు మందుగానే రైతులకు ధాన్యం డబ్బులు ఇస్తే మరింత సంతోషిస్తారు. క్షేత్రస్థాయిలోకి నేను వచ్చింది రైతులతో మాట్లాడటానికే. మీ సూచనలు, సలహాలు కూడా తీసుకునేందుకు వచ్చాను. ఏ పంట పండిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో రైతులు ఆలోచించుకోవాలి. భూమి, వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకుని పంట సాగు చేయాలి’ అని చెప్పారు.

TOP STORIES