పవన్ కల్యాణ్ తన శాఖ కాకపోయినా కూడా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లినందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
అనుభవమున్న రంగం కాబట్టి షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారని, మంచి ప్రయత్నమే కానీ పవన్ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని అన్నారు. పోర్టు ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్ పవన్తో బోటులోనే ఉన్నారని తెలిపారు. వాళ్లిద్దరూ షిప్లోనే ఉండి పవన్కు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
పవన్ను షిప్లోకి ఎక్కనివ్వొద్దని చంద్రబాబు చెప్పుండాలని అన్నారు. లేదా పవన్ అబద్ధమైనా చెప్పుండాలని చెప్పారు. ప్రాణాలకు తెగించి స్టెల్లా షిప్నే ఎందుకు సీజ్ చేస్తామని చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కెన్ స్టార్ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు.
సీజ్ ద షిప్ అని కెన్ స్టార్ షిప్ను ఎందుకు అనలేదని ప్రశ్నించారు. ఐ విల్ టాక్ టు సెంట్రల్ మినిస్టర్ అని ఎందుకు అనలేదని అన్నారు. ‘స్టెల్లా షిప్ను 36 మంది ఎక్స్ పోర్టర్లు 35 వేల టన్నులు ఎక్స్ పోర్టు కోసం తెచ్చుకున్నారు. కెన్ స్టార్ షిప్లో ఒకే ఎక్స్ పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం ఎక్స్ పోర్టు చేస్తున్నాడు. ఆ కెన్ స్టార్కు ఎందుకు వెళ్లరంటే ఆ ఎక్స్ పోర్టర్ పేరు వేల్పూరి శ్రీను. మంత్రి పయ్యావుల కేశవ్ కు స్వయానా వియ్యంకుడే ఈ వేల్పూరి శ్రీను. వేల్పూరి శ్రీను ఎక్స్ పోర్టు చేస్తున్న బియ్యంలో దొంగ బియ్యం ఉండవా? పీడీఎస్ రైస్ ఉండవా వేల్పూరి శ్రీను అయితే మన కళ్లకు గంతలు కట్టేసుకుంటారా? షిప్ లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది ఎవరు?’ అని పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు.