ఇండియా–పాకిస్థాన్ మధ్య నియంత్రణ రేఖ (LoC) వద్ద ఉద్రిక్తత మరోసారి తారాస్థాయికి చేరింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం మంగళవారం సరిహద్దును దాటి కాల్పులకు దిగడంతో భారత సైన్యం దీటుగా స్పందించింది. ఈ ఘటనలో ఒక మైన్ పేలుడు కూడా సంభవించినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి.
ఇదీ జరిగింది
పాకిస్థాన్ సైన్యం తమ సరిహద్దు గీత దాటి భారత భూభాగంలోకి చొరబడి, రాత్రి సమయంలో అనవసర కాల్పులు జరిపినట్లు ఆర్మీ ప్రతినిధి లెఫ్ట్నెంట్ కల్నల్ సునీల్ బరాత్వల్ వెల్లడించారు. ఈ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ‘పరిస్థితి అదుపులో ఉంది, నిశితంగా పర్యవేక్షిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇరు వైపులా సైనిక నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
2021 ఫిబ్రవరిలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGsMO) మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూ వస్తోంది. ఈ తాజా ఘటన కూడా ఆ ఒప్పందానికి విరుద్ధంగా జరిగిందని భారత సైన్యం ఆరోపించింది. ‘సరిహద్దులో శాంతిని కాపాడాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉంది. పాకిస్థాన్ ఈ బాధ్యతను విస్మరిస్తోంది‘ అని భారత ఆర్మీ తెలిపింది.
స్థానిక ప్రజలపై ప్రభావం
సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ కాల్పుల వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూంచ్, రాజౌరీ వంటి జిల్లాల్లో గతంలో జరిగిన ఇలాంటి ఘటనల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా స్థానికులు ఇళ్లలోనే ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నిరంతరం ఘర్షణలు
ఇండియా–పాకిస్థాన్ మధ్య సరిహద్దు వివాదాలు 1947లో భారత విభజన నాటి నుంచి కొనసాగుతున్నాయి. కాశ్మీర్ ప్రాంతంపై తమకు హక్కు ఉందంటూ పాకిస్థాన్ దశాబ్దాలుగా ఘర్షణలకు దిగుతోంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు, డ్రోన్ ద్వారా ఆయుధాల సరఫరా వంటివి కూడా ఉద్రిక్తతను పెంచుతున్నాయి. తాజా ఘటనను భారత రక్షణ శాఖ సీరియస్గా తీసుకుంది. సరిహద్దులో అదనపు బలగాలను మోహరించే అవకాశం ఉందని సమాచారం.