ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లలో ఈ మార్పులు వర్తింపచేయనున్నారు.
పెన్షనర్ల సౌలభ్యం కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలున్నాయి. పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్ దారుల సంతృప్తి మెరుగుపర్చేందుకు పెన్షన్ల పంపిణీ యాప్ లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పెన్షన్ పంపణీ యాప్ లో 20 సెకన్ల ఆడియో పెట్టినట్లు తెలిపింది. పెన్షన్ ఇచ్చే ముందు లబ్దిదారులకు సీఎం చంద్రబాబు సందేశంతో కూడిన ఈ ఆఢియో వినిపించాలని ఆదేశించింది. అలాగే వృద్ధ పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు నమస్కారాలు తెలియజేయాలని తెలిపింది.
అలాగే పెన్షన్ దారుల ఇంటికి 300 దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్ లోనే నోట్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. అలాగే పెన్షన్ దారుల సౌలభ్యం కోసం ఉదయం 6 గంటలకు బదులుగా 7 గంటలకు పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించడం ద్వారా పెన్షన్ దారులకు సంతృప్తికరంగా వాటిని పంపిణీ చేయాలని సెర్ఫ్ సీఈవో కరుణ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయాలు, ఇతర అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.రష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే అనర్హులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తోంది. ఇప్పుడు తాజా మార్పులతో అర్హులకు సంతృప్తి కరంగా పెన్షన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.