ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో సోమవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రెవెన్యూ అవసరమని ఇందుకోసం రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్దతిలో కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్లిందని, దీంతో చాలా చోట్ల భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. అటువంటి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 శాతం నుండి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే వస్తుండగా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోనూ 10 శాతం వరకు గ్రీవెన్స్ వస్తున్నాయని చెప్పారు. వీటిన్నంటి పరిష్కరించే దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి తాము టార్గెట్ గా పెట్టుకున్న 9,500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో జగన్ తన స్వార్ధం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను చాలా ఇబ్బందులు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం వారితో స్నేహ పూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పారు. భూ వివాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ఇప్పటికి లక్షా 70 వేల ఫిర్యాదులు రాగా 11 వేల ఫిర్యాదులను అక్కడిక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. అయితే ఇలా పరిష్కరించిన సమస్యలను ముందుగానే ఎందుకు చేపట్టలేదంటూ సంబంధిత అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.