టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్తలు సానా సతీష్, బీద మస్తానరావులను పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎన్డీయే కూటమి తరఫున ఒక స్థానానికి బీజేపీ తన అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ఇప్పటికే ప్రకటించింది. ఈ మూడు స్థానాలు వైఎస్సార్సీపీకి చెందినవి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీద మస్తానరావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్ కృష్ణయ్యలు అందులోకి జంప్ చేశారు. ఆర్థికంగా స్థితిమంతుడైన బీద మస్తానరావు రాజీనామా సమయంలోనే తిరిగి ఆ స్థానాన్ని తనకే కేటాయించేలా ఒప్పందం చేసుకుని టీడీపీలో చేరారు. ఆర్ కృష్ణయ్య సైతం మళ్లీ తనకే సీటు ఇచ్చే ఒప్పందంతో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ మేరకు వారిద్దరికీ తిరిగి రాజ్యసభ సీట్లు దక్కాయి. మోపిదేవి వెంకట రమణ రాజీనామా చేసిన స్థానాన్ని టీడీపీలో ప్రస్తుతం బలంగా ఉన్న సానా సతీష్కు కేటాయించారు. సానా సతీష్ గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. కానీ సమీకరణల్లో ఆ సీటు పొందలేకపోయారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవిని ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీటు తెచ్చుకున్నారు. ఈ స్థానం కోసం మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. సానా సతీష్ లోకేష్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మారడం, పార్టీలో ఇప్పుడు ఆయన చెప్పిన మాటే నడుస్తుండడంతో రాజ్యసభ అవకాశం ఆయనకే లభించింది.