వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. పార్టీలో తాను అనుభవించిన అవమానాలు, కోటరీ ఆధిపత్యం, లిక్కర్ స్కాం విచారణపై జరిపిన ప్రశ్నలకు సమాధానాల అంశాలపై ఆయన బహిరంగంగా మాట్లాడారు. మీడియాతో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“నన్ను నెంబర్ 2 స్థానం నుంచి… 2000 స్థానానికి దించారు”
వైసీపీ లో తాను నెంబర్ 2 స్థానంలో ఉన్నా, అతి తక్కువ సమయంలోనే తన ప్రాముఖ్యతను గాలికి వదిలేశారని విజయసాయి ఆవేదన వ్యక్తం చేశారు.
“జగన్ మనసులో నాకు స్థానం లేదని అర్థమైందే బయటకు వచ్చాను. నన్ను వెన్నుపోటుదారుడిగా చూపించి నమ్మకాన్ని దెబ్బతీశారు,” అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
“వైసీపీని విడిచే కారణం కోటరీ వేధింపులే”
తనపై కుట్రలు జరిగాయనీ, చుట్టూ ఉన్న కోటరీనే పార్టీ నుంచి వెళ్ళడానికి గల ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు.
“అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని కొంతమంది తమ స్వంత వ్యవహారంగా మార్చుకున్నారు. నేను పెట్టించిన మీడియా ఛానల్లోనే నన్ను విమర్శించారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కాం – “సిట్ అడిగిన ప్రతీ ప్రశ్నకీ సమాధానం ఇచ్చా”
లిక్కర్ స్కాంలో తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయి స్పష్టత ఇచ్చారు.
“హైదరాబాద్, విజయవాడలో నా ఇళ్లలో రెండు మీటింగ్లు జరిగాయి. వాసుదేవరెడ్డి, మిథున్రెడ్డి, శ్రీధర్రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి హాజరయ్యారు. ఎస్ఐటీ అడిగిన ప్రతి ప్రశ్నకూ నేను సమాధానమిచ్చాను” అని చెప్పారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
“రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్. ఆయనే స్కాంలో ప్రధాన పాత్రధారి. పార్టీకి, ప్రజలకు మోసం చేసినవాడు. నాకు తెలుసో లేదో కానీ అతడు మూడు కంపెనీలతో కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చాడు,” అని ఆరోపించారు.
“ప్రజలు కోరుకుంటే తిరిగి రాజకీయాల్లోకి వస్తా”
రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన విజయసాయి, ప్రజలు కోరితే తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
“ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. మరోసారి అవసరం వస్తే, ప్రజల కోరిక ఉంటే రాజకీయాల్లోకి వస్తా,” అని తెలిపారు.