“ఆపరేషన్ సిందూర్’ అనే భావోద్వేగపూరిత పేరు పెట్టడానికి చూపిన శ్రద్ధ…
అందులో కుంకుమ భరిణ, కాస్త వొలిగిన కుంకుమ ఫోటోను చేర్చడానికి చూపించిన చొరవ…
ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించేందుకు విదేశాంగ శాఖకు చెందిన ఒక కశ్మీరీ బ్రాహ్మణ దౌత్యాధికారి విక్రం మిస్రీ, వైమానిక దళ ప్రతినిధి గా సిక్కు దళిత మహిళ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, ఆర్మీ ప్రతినిధిగా ముస్లిం మహిళ కల్నల్ సోఫియా ఖురేషి తో జట్టు కూర్పు పట్ల కనబరిచిన ఆసక్తి…
పెహల్గాంలో 28 మంది భారతీయులను బలిగొన్న ఉగ్రవాద మూకలపై దేశం వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలను అవకాశంగా తీసుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి వేసిన ప్రణాళిక..
అందుకు మీడియా, సోషల్ మీడియాను వాడుకోవడానికి వేసిన ఎత్తుగడ…
వీటన్నింటిపై చూపించిన శ్రద్ధలో అసలు లక్ష్య సాధనలో అణుమాత్రం కూడా కేంద్ర ప్రభుత్యం కనబరచనే లేదు..అసలు ఆపరేషన్ సిందూర్ ద్వారా సాధించింది ఏమిటీ అని వెనక్కి తిరిగి చూస్తే కనిపించేది.. శూన్యం..
శుష్క వాగ్దానం..
అవును..
అదే చివరికి మిగిలింది…
అదే చేదు నిజం…
పాకిస్తాన్ మీద దాడి చేయాలని దేశ ప్రజలు డిమాండ్ చేయలేదు.. ఎందుకంటే 2001లో పార్లమెంటు మీద దాడి చేసినప్పుడు, 2009లో ముంబయిలో తాజ్ హోటల్ తదితర వాటిపై దాడి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ పాకిస్తాన్ మీద దాడి చేయలేదు కదా… ఎందుకంటే అది పాకిస్తాన్ చేస్తున్న పరోక్ష యుద్ధం అని అందరికీ తెలుసు. మన ప్రతీకారం ఉగ్రవాదులపై చూపించగలం తప్పా నేరుగా పాకిస్తాన్ మీద ప్రదర్శించలేమని దేశ ప్రజలకు తెలుసు.
2016, 2019లలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసినపుడు కూడా పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేయ లేదు కదా..,( వాస్తవానికి గతంలో కేంద్రంలో ఉన్న చాలా ప్రభుత్వాల హయాంలో భారత్ కొన్ని సార్లు సైన్యం సర్జికల్ దాడులు చేసింది. కానీ అంతర్జాతీయ సమాజానికి వెల్లడించ లేదు.. అది వేరే విషయం)..
మరి ఇప్పుడు పెహల్గాం ఉదంతానికి ప్రతీకారంగా సర్జికల్ దాడులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కే పరిమితం కాకుండా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై కూడా ఎందుకు చేసినట్టు…అంటే పాకిస్తాన్తో నేరుగా యుద్ధం చేయడానికే అని చెప్పినట్టు కదా… అందుకే ఆ దేశాన్ని కవ్వించినట్టు కదా..
పాకిస్తాన్ మనల్ని తిరిగి కవ్విస్తూ డ్రోన్ దాడులు చేసింది..
మరి ఈ పరిణామాలను సద్వినియోగం చేసుకుని ఒక “లాజికల్ కంక్లూజన్’ వరకూ తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కదా… మరి ఏమీ సాధించకుండా
హఠాత్తుగా రెండు రోజుల్లోనే ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించినట్టు… ఏం సాధించామని…!?
ఈ మాత్రం దానిని అంతటి భావోద్వేగాలు ఎందుకు రెచ్చగొట్టడం…
అంటే ఎవరైనా వ్యక్తులు గానీ ఏ రాజకీయ పార్టీ గానీ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే దేశ ద్రోహి ముద్ర వేయడానికా…
యావత్ దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి కదా… సైన్యం వెంట నిలుస్తామని ప్రకటించాయి కదా… మరి ఇప్పుడు వారికేం చెబుతారు… ఇదిగో ఇదీ సాధించాం అని చెప్పడానికి ఏముంది… గుడ్డి సమర్థింపు తప్పా.. ఇంకా ప్రశ్నిస్తే సోషల్ మీడియా లో వాళ్ల ను ట్రోల్ చేయడం తప్పా…
– పెహల్గాంలో ఉగ్రవాదులు 28 మందిని బలిగొన్నారు.. మరి ఆపరేషన్ సిందూర్ ద్వారా కనీసం 28 మంది ఉగ్రవాదులను హతమార్చారా….!? 80 మంది హతం, 100 మంది హతం అని మీడియాకు లీకులు ఇవ్వడం తప్పా కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటనలో అదేమీ చెప్పనే లేదు.. భారత్ దాడులతో తమ భూభాగంలో ఎంత మంది చనిపోయారో పాకిస్తాన్ ఎప్పటికీ చెప్పదు. ఒక పదిమంది ఉగ్రవాదులు ఒక వాహనంలో వచ్చి 28 మందిని చంపి మరీ వెళ్ళిపోయారు.కానీ మనం ఇంత సైన్యాన్ని మొహరించి, క్షిపణులు ప్రయోగించి, ఇతరత్రా భారీగా నిధులు వెచ్చించి మరీ ఎంతమంది ఉగ్రవాదులను అంతం చేశామంటే ఏ లెక్కా లేదు. ఏ రకంగా చూసినా లెక్క సరిపోలేదు కదా…
– పోనీ పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చిందా..!?
తమ దేశంలో ఆశ్రయం ఇస్తున్న ఉగ్రవాదులను అప్పగిస్తానని చెప్పిందా…!? సింధూ జలాలు ఇక మీవే.. మేం అడగం అని ఒప్పుకుందా…!? ఏమీ లేదు కదా…
ఇక అమెరికా పెద్దన్న అని మనం అధికారకంగా ఒప్పుకునట్టే కదా.. కాల్పుల విరమణ అని భారత్, పాకిస్తాన్ ప్రకటించ లేదు.. మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. మన తరపున అమెరికా ప్రకటించడం ఏమిటీ.. తరువాత మనం అవును కాల్పుల విరమణ అని చెప్పడం ఏమిటో.. ఒక సార్వభౌమాధికార దేశంగా దాడి చేసింది మనం… కాల్పుల విరమణ అని మొదట ప్రకటించాల్సింది మనం కదా… అమెరికా ప్రకటిస్తే అర్థం ఏమిటీ… అమెరికా ఒత్తిడి( మధ్య వర్తిత్వం అని చెప్పినా సరే..) తోనే కాల్పుల విరమణ అని ఒప్పుకునట్టే కదా.. ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?
1971 యుద్ధం ఎలా జరిగిందో తెలుసా?
పాకిస్తాన్ ను రెండుగా విభజించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన 1971 యుద్ధాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.
ఆనాడు పాకిస్తాన్ ఏమీ భారతీయుల్ని బలి తీసుకోలేదు. బెంగాల్ మాతృభాషగా ఉన్న తూర్పు పాకిస్తాన్ ( ప్రస్తుత బంగ్లాదేశ్ ) ప్రజలు స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు.. అది ఆ దేశ అంతర్గాత వ్యవహారం. కానీ భారత్ ఆ పరిమాణామాలను సద్వినియోగం చేసుకుని ఏకంగా పాకిస్తాన్ ను విభజించింది. భారత్ కు రెండు వైపులా ఉన్న శత్రు దేశం పాకిస్తాన్ ను ఒక వైపునకే పరిమితం చేసింది..
1971లో భారత్ ఒక పేద దేశం ( గౌరవం కోసం
అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకున్నా సరే..). భారత్, పాకిస్తాన్ ఆర్థికంగా సమానంగా ఉన్నాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే రెండింటి కరెన్సీ విలువ ఒకటే.. ఆగ్రరాజ్యం అమెరికా ఏకపక్షంగా పాకిస్తాన్ కు మద్దతుగా ఉంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా సరే భారత్ దూకుడుగా, వ్యూహాత్మకంగా వ్యవహరించి యుద్ధాన్ని విజయవంతంగా ముగించింది. పాకిస్తాన్ ను విభజించింది.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైంది. భారత్ ప్రపంచం లోనే ఐదో ఆర్థిక శక్తి గా ఉంది. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు, భారతీయ మార్కెట్ ను వాడుకునేందుకు వ్యూహాత్మకంగా, వాణిజ్య పరంగా అమెరికా కు భారత్ అవసరం ఉంది. అయినా సరే ఇంతటి సానుకూల పరిస్థితిని సద్వినియోగం చేసుకో లేకపోయాం. ఏమీ సాధించ లేకపోయాం. ఈ మాత్రం అరకొర దాడులకు ఆపరేషన్ సిందూర్ అంటూ హడావుడి అనవసరం. రొటీన్ గా సైన్యం కశ్మీర్ లో చేసే ఆపరేషన్లు సరిపోతాయి. దశాబ్దాలుగా అదే చేస్తున్నాం.. ఇప్పుడూ అదే చేయాల్సింది..
- ఇక ఎవరు అంగీకరించినా… అంగీకరించక పోయినా..
ఈ పరిణామాల నేపథ్యం లో..
దూకుడు…
సాహసం..
సమర్థత…
మొండి ధైర్యం…
వ్యూహ చతురత…
దీర్ఘ కాలిక ప్రయోజనాల పరిరక్షణ..
అంతిమ విజయం సాధించడం…
అంటే అందరి మనసుల్లో మెదిలే ఒకే ఒక పేరు… ఇందిరా గాంధీ.
– వ్యాసకర్త వడ్డాది శ్రీనివాస్