Andhrabeats

14 మందిని చంపి వీర మరణం : శోక సంద్రంలో జవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబం

Jawan Murali Naik
ఏపీకి చెందిన యువ ఆర్మీ జవాన్‌ ఎం మురళీ నాయక్‌ వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ బలగాల కాల్పుల్లో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కార్మిక కుటుంబానికి చెందిన మురళీ నాయక్‌ వయసు 25 ఏళ్లు మాత్రమే.పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లితాండ గ్రామం.  మురళీ మరణం విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మురళీ తల్లిదండ్రులు ముదావత్‌ శ్రీరామ్, జ్యోతిబాయి ముంబైలో నిర్మాణ రంగంలో దినసరి కూలీలుగా పనిచేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు మురళీ చిన్నప్పటి నుంచే పట్టుదలతో చదివాడు. డిసెంబర్‌ 2022లో సైన్యంలో చేరిన మురళీ 851 లైట్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సైన్యంలో చేరిన తర్వాత తల్లిదండ్రులు కూలి పని మానేసి స్వగ్రామానికి తిరిగివచ్చారు.
యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో గురువారం రాత్రి మురళి తన బంధువులకు ఫోన్‌ చేసి సరిహద్దు వద్ద భీకరంగా కాల్పులు జరుగుతున్నట్లు చెప్పాడు. ‘ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నా తల్లిదండ్రుల గురించి నాకు ఆందోళనగా ఉంది’ అని చెప్పాడు. మురళీ బంధువు రంజిత్‌ నాయక్‌ మాట్లాడుతూ ‘అతని మాటల్లో తొలిసారి భయం కనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడలేదు. మేమంతా అతనికి ధైర్యం చెప్పాం. తల్లిదండ్రుల గురించి చింతించవద్దని చెప్పాం. మాతో మాట్లాడిన కొద్ది గంటలకే మురళి పాకిస్తాన్‌ కాల్పుల్లో మరణించినట్లు తెలిసింది’ అని చెప్పాడు.
మురళీ నాయక్‌ తండ్రి శ్రీరాం నాయక్‌ను మీడియా పలుకరించగా ఆయన మురళి గురించి కొన్ని విషయాలు చెప్పారు. తన కుమారుడు చనిపోయేముందు పాకిస్థాన్‌ శత్రువులు దేశంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుని వీరమరణం పొందాడని తెలిపారు. 14మంది శత్రవుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో వివరించారు. ‘మురళీ నాయక్‌ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు.. 2022 నవంబర్‌ 8న అగ్నివీర్‌ రిక్రూర్ట్‌మెంట్‌లో సెలక్ట్‌ అయ్యాక ఉద్యోగంలో చేరాడు. నాలుగేళ్లు అగ్రిమెంట్‌ ఉంది. 2026 నవంబర్‌తో అగ్రిమెంట్‌ ముగిసేది. ఇవాళ ఆర్మీవాళ్లు నా భార్యకు ఫోన్‌ చేశారు.. ఆమెకు హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్‌ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్‌ జరిగింది. మురళీనాయక్‌ చనిపోయారని నాతో చెప్పారు. కాల్పుల జరిగిన సమయంలో 14 మందిని మురళీనాయక్‌ చంపాడని, వాళ్లను ఎటాక్‌ చేసిన తర్వాత వెనక్కు తిరిగి వస్తున్న సమయంలో మురళిపై కాల్పులు జరిగాయి’ అని ఆర్మీ వాళ్లు చెప్పారని తెలిపారు. ఇటీవలే మురళీ నాయక్‌ను ఆర్మీ పంజాబ్‌ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు తీసుకెళ్లిందని అని వివరించారు.
మురళి చివరిసారిగా జనవరి 6న 15 రోజుల సెలవుపై ఇంటికి వచ్చాడు. కుటుంబంతో గడిపిన ఆ రోజులు ఇప్పుడు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మురళీ లేడనే వార్తను విని ఆ గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో తెలుగు జవాన్‌ మురళీ నాయక్‌ వీరమరణం పొందాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ, లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద శత్రువులను అడ్డుకొని ప్రాణాలర్పించాడు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవిత మురళీ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. మాజీ సీఎం జగన్‌ సైతం ఫోన్లో పరామర్శించారు.

TOP STORIES