తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం రోజురోజుకీ పెరుగుతోంది. భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతుండడంతో హుండీ ఆదాయం కూడా అందుకు తగ్గట్టుగానే రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఆపద మొక్కులు తీర్చే వెంకన్న ఆస్తుల విలువ ప్రతి ఏడాది అమాంతం పెరుగుతోంది.
2024 సంవత్సరానికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. 99 లక్షల మంది తల నీలాలు సమర్పించారని వెల్లడించింది. 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపింది. 12.14 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు వివరించింది.
వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం లక్షలాదిగా జనం తరలి వస్తుంటారు. భక్తి శ్రద్దలతో వేంకటేశుని ఆరాధన చేస్తారు. దీంతో నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల గిరులు మార్మోగుతుంటాయి. తిరుమల వెళ్లిన భక్తులు స్వామివారికి విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. వందలాది ఏళ్లుగా ఏడుకొండల స్వామికి వివిధ రూపాలలో కానుకలు సమర్పించే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. అలాగే శ్రీనివాసుడి ఆదాయం కూడా పెరుగుతూ తిరుపతి దేవస్థానం హుండీలో కాసుల వర్షం కురుస్తోంది. గత ఏడాది రూ.1,161కోట్లు నగదు, 1,031 కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు సమాచారం.
టీటీడీ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసింది. దీంతో దేవస్థాన డిపాజిట్లు మొత్తంగా రూ.18 వేల కోట్లకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ మొత్తానికి ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ రూ.1,200 కోట్లు దాటిందట. గత ఐదేళ్ల కాలంలో వడ్డీ బాగా పెరిగినట్టు తెలుస్తోంది. 2018 నాటికి ఏటా లభించే వడ్డీ రూ.750 కోట్లు ఉండగా.. ఇప్పుడు మరో రూ.500 కోట్లు కలిసి వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,200 కోట్లకు చేరింది. గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లు దాటుతోంది. కేవలం హుండీ ద్వారా సంవత్సరానికి 1200 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. దీనికి దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఇచ్చే విలువైన కానుకలు అదనం.