పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు దాడికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాయి. ఇందులో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్టు గుర్తించాయి. ఫోరెన్సిక్ నివేధికల ఆధారంగా దాడి కోసం కే 47, ఎం4 తుపాకులు వాడినట్టు నిర్ధారించాయి. ఉగ్రవాదులు అత్యంత క్లిష్టమైన హిమాలయ పర్వతాలు, పహల్గామ్ అడవుల్లో నుండి 22 గంటల పాటూ కాలినడకన వచ్చినట్టు గుర్తించాయి. కొకెర్నాగ్ అడవుల నుండి బైసరన్ లోయకు వచ్చేందుకు కష్టతరమైన భూభాగం గుండా నడిచి వచ్చి దాడి చేశారని పేర్కొన్నాయి.
ముందుగా ఉగ్రవాదులు దుకాణాల వెనక నుండి పాయింట్ బ్లాంక్ రేంజ్లో పెట్టి కాల్పులు జరిపినట్టు గుర్తించారు. దాడికి ముందు వారిని కల్మా పటించాలని అడిగినట్టు తెలుస్తోంది. కాల్పుల సమయంలో పర్యాటకులు పరుగులు తీయడంతో జిప్ లైన్ వద్ద ఉన్న ఇద్దరు టెర్రరిస్టులు వారిపై కాల్పులు జరిపినట్టు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఓ ఫోటోగ్రాపర్ చెట్టుపైకి ఎక్కి ఘటనను పూర్తిగా వీడియో తీశాడు. ఉగ్రవాదుల కంటపడకుండా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ఇచ్చిన వీడియో ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది.
బైసరన్కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియో గ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని మొత్తాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియోల ఆధారంగా జరిగిన దారుణాన్ని ఓ వరుసక్రమంలో తెలుసుకొనేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు కీలకంగా మారాయి.
ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. తొలుత ఇద్దరు ఉగ్రవాదులు సందర్శకులను ముస్లిం మతాచారాన్ని పాటించమని బెదిరించారు. ఆ తర్వాత దాదాపు నలుగురిని కాల్చి చంపారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. సందర్శకులు తలోదిక్కులకు పారిపోగా.. జిప్లైన్ అనే ప్రదేశం నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు మొదలుపెట్టారు.
‘‘ఈ ఫొటోగ్రాఫర్ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి.. తూటాలను తప్పించుకోవడానికి చెట్టు కొమ్మపై దాక్కొన్నాడు. ఆ తర్వాత మొత్తం చిత్రీకరించాడు’’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నించి ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు, వారికి సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఉగ్రవాదులు స్థానికుల నుంచి రెండు ఫోన్లు కూడా లాక్కొనట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిల్లో ఒకటి సందర్శకుడిది కాగా.. రెండోది స్థానికులది. ఇప్పుడు వాటిని ట్రాక్ చేసేందుకు యత్నిస్తున్నారు. వీటి ఆధారంగా ఉగ్రవాదుల ప్రస్తుత లొకేషన్లు కూడా కనుగొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాడి తర్వాత నుంచి అవి స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించారు. ఇక ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఎం4 రైఫిల్ ఖాళీ తూటాలను గుర్తించారు.