పహల్గామ్ పర్యాటకుల హత్యలపై కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు, బంద్
సివిల్ సొసైటీ, వ్యాపారులు, ఉద్యోగులతో సహా అన్ని వర్గాల భాగస్వామ్యం
పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయ బుధవారం నాడు నిరసనలతో అట్టుడికింది. ఈ దారుణ మారణకాండను ఖండిస్తూ లోయ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు. గత 35 ఏళ్లలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్లో ఇలాంటి సంపూర్ణ బంద్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఈ రక్తపాతాన్ని తీవ్రంగా ఖండించారు. పౌర సమాజ సభ్యులు, వ్యాపార సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, సాధారణ పౌరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బాధితులకు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి హింసాత్మక చర్యలను ఏమాత్రం సహించరాదని నిరసనకారులు అధికారులను డిమాండ్ చేశారు. శాంతి, న్యాయం, మత సామరస్యానికి కశ్మీరీలు కట్టుబడి ఉన్నారని ఈ నిరసన ప్రదర్శన చాటి చెప్పింది.
మరోవైపు, కశ్మీర్లోని అన్ని పాఠశాలల్లోనూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం అసెంబ్లీల సమయంలో మరణించిన పర్యాటకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు, సంతాప సమావేశాలు నిర్వహించారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింని ఒమర్ చెప్పారు: ఖర్గే
ఈ దాడి ప్రభావం స్థానిక పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లుగా కశ్మీర్లో పర్యాటక రంగం క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరులో మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తనకు తెలిపారని వెల్లడించారు.
“వేసవి కాలం ఇప్పుడే ప్రారంభమైంది, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడం మొదలుపెట్టే సమయం ఇది. కశ్మీర్కు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. వారు పూర్తిగా పర్యాటక ఆదాయంపైనే ఆధారపడతారు. ఈ దాడితో ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, పర్యాటకమే ప్రధాన జీవనాధారం అయినందున తాము తీవ్రంగా దెబ్బతిన్నామని ఒమర్ అబ్దుల్లా చెప్పారు” అని ఖర్గే వివరించారు.