Andhrabeats

8న ప్రధాని మోడీ విశాఖ పర్యటన

ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్నారు. ఇందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 20 వరకూ ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలను చేయనున్నారు. 8వ తేదీ బుధవారం సాయంత్రం 4.15 గం.లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని సాయంత్రం 4.45 గం.ల నుండి 5.30 గం.ల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారని సిఎస్ విజయానంద్ వెల్లడించారు. అనంతరం సా.5.30 గం.ల నుండి 6.45 గం.ల వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారని తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 7.15 గంటలకు విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళతారని సిఎస్ పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖలో సుమారు 3 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ముఖ్యంగా వెంకటాద్రి వంటిళ్ళు రెస్టారెంట్ ప్రాంతం నుండి సుమారు కిలోమీటరు పొడవున రోడ్ షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకూ చేరుకుంటారని తెలిపారు. అక్కడ నుండే వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బిబినగర్, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. అదే విధంగా 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడం తోపాటు పలు జాతీయ రహదార్లు, రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభిస్తారని సిఎస్ విజయానంద్ వెల్లడించారు.

 

ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల వాహనాల పార్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలక్టర్, పోలీస్ కమీషనర్, మున్సిపల్ కమీషనర్ తదితర అధికారులను ఆదేశించారు. సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన జరగనున్నందున రోడ్ షో, సభా వేదిక, వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలను బస్సులు, ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సిఎస్ ఆదేశించారు. సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, అల్పాహారం,భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావీయకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలక్టర్ సహా పరిసర జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. వాహనాల ట్రాఫిక్,పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని డిజిపి,విశాఖ పోలీస్ కమీషనర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.

ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న డిజిపి ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎస్పిజి సమన్వయంతో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ విశాఖనగరంలో ప్రధాని రోడ్ షోలో సుమారు 80 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా సభలో లక్షా 80 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లనీ దాదాపు పూర్తి కావచ్చాయని ఏర్పాట్లన్నిటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. విశాఖ పోలీస్ కమీషనర్ ఎస్.బాగ్చి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్ చేయడం జరిగిందని తెలిపారు .

TOP STORIES